Updated 15th April 2023 Saturday 3:20 pm
Minister Roja : ప్రతీ ఇంటికి జగన్ స్టిక్కర్ చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ప్రజల అంగీకారంతోనే తాము స్టిక్కర్లు వేస్తుంటే టీడీపీ, జనసేన నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దొంగ చాటుగా రాత్రి సమయాల్లోనూ, ఇళ్ళల్లో లేని సమయంలోనూ జగన్ స్టిక్కర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఏదో పది ఇళ్లకు టీడీపీ, జనసేన స్టిక్కర్లు వేసేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.
శనివారం ఆమె 10tvతో మాట్లాడుతూ.. పాలనపై పీపుల్ సర్వే పెట్టే దైర్యం జగన్ కు తప్ప ఇంకెవరికి ఉండదన్నారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని.. ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబు పనైపోయిందని.. మనవడితో ఆయన ఆడుకోవాలని సలహాయిచ్చారు. రాష్ట్రానికి పట్టిన అసలైన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం తాకట్టు పెట్టారని.. అమరావతి నిధులు మింగేశారని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అని పేర్కొన్నారు. స్కాంలు చేసింది చంద్రబాబు.. జగన్ అమలు చేస్తున్నది స్కీములు అన్నారు.
సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు? తమ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో చర్చిద్దామని సవాల్ చేశారు. కుప్పంలోనైనా నగరిలోనైనా చర్చకు సిద్ధం దమ్ముంటే రా.. అని చంద్రబాబుకు మంత్రి రోజా ఛాలెంజ్ చేశారు. 2024 జగన్ అన్న వన్స్ మోర్.. ఈ విషయం టీడీపీ, జనసేనలకు తెలిసిపోయిందన్నారు.
‘రెండు ఎకరాలతో మొదలైన చంద్రబాబుకి 660 కోట్లు ఎలా వచ్చాయి? లోకేష్ తోడళ్లుడు కబ్జా చేసినప్పుడు పవన్ ఏమయ్యాడు? అనుమతులకు లోబడే రుషికొండలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం 61 ఏకరాలు ఉంటే 10 ఏకరాల్లో మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. 7 బ్లాక్ లకు మాకు పర్మిషన్ ఉంటే 4 బ్లాకులు నిర్మిస్తున్నాం. పవన్ కళ్యాణ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి అవసరం ఉన్నప్పుడల్లా ప్యాకేజ్ తీసుకుని పవన్ ట్వీట్ లు పెడతాడు’ అంటూ మండిపడ్డారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ లు సెల్ఫీలతో చెత్త పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని ప్రజలు అంటుంటే చంద్రబాబుకి కడుపు మండిపోతోందన్నారు. చంద్రబాబుకు కర్మ పట్టి రోడ్లపై తిరుగుతున్నాడని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు రోడ్లపై తిరిగినా.. పవన్ ను కలుపుకున్నా జగన్ ను ఏమీ చెయ్యలేరని స్పష్టం చేశారు. 2024లో కుప్పంలో చంద్రబాబు కుదేలు అయిపోవడం ఖాయమన్నారు.







