ఇజ్రాయెల్ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: భారత మగువల అందం మరోసారి విశ్వవ్యాప్తమైంది. విశ్వసుందరి కిరీటం కోసం 21 ఏళ్లు కొనసాగిన నిరీక్షణకు ఎట్టకేలకు అందమైన ముగింపు లభించింది. అందంతో పాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యునివర్స్-2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000)ల సరసన చేరింది. తన అందంతో పాటు పదునైన సందేశం, తెలివైన సమాధానాలతో అందరినీ అబ్బురపరిచింది. హర్నాజ్ సంధు పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్, వెండితెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేశారు. మోడలింగ్లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. సోషల్మీడియాలోనూ ఆమెకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు.







