UPDATED 20th MAY 2022 FRIDAY 09:40 AM
Supreme Court: సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమరరాజా బ్యాటరీస్ సంస్థపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఫిబ్రవరిలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమకోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి, ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది.







