UPDATED 13th AUGUST 2017 SUNDAY 10:00 PM
రాజమహేంద్రవరం: కలియుగంలో భగవంతుని ఆరాధన మాత్రమే ముక్తిని కలిగిస్తుందని ఇస్కాన్ అధ్యక్షులు సత్యగోపీనాథ్దాస్ అన్నారు. స్థానిక గౌతమి ఘాట్ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి విశేష పూజలు జరిగాయి. శృంగార హారతి, భాగవత ప్రవచనం జరిగిన భాగవత ప్రవచనంలో సత్యగోపీనాథ్దాస్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ నిత్యం హరేకృష్ణ మంత్రాన్ని 108సార్లు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి భగవంతుని కృపకు పాత్రులవుతారన్నారు. జీవులన్నింటిలో ఉత్తమమైనది మానవజన్మ అని, భగవంతుడు అందించిన వాటిలో కొంత దానం చేయటం ద్వారా పుణ్యం లభిస్తుందన్నారు. అనంతరం అఖండ హరినామ సంకీర్తనం, ఆధ్యాత్మిక ప్రవచనం, స్వామీజీల పర్యవేక్షణలో విశ్వశాంతి యజ్ఞము నిర్వహించారు. అనంతరం రాధా గోపీనాధులను హనుమత్ వాహనంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, స్వామీజీలు ఊరేగింపు సేవలో పాల్గొన్నారు. అనంతరం మందిరంలో గౌరహారతి, రాధాగోపీనాథులకు ఊంజల్ సేవ నిర్వహించారు. .







