UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 3:30 PM
PM Modi-Pawan kalyan Letter : ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్కల్యాణ్ ఐదు పేజీల లేఖ అందజేశారు. ఈ లేఖలో ఏముంది? మోడీతో పవన్ భేటీలో ఏం చర్చించారు? వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించా? లేక ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపైనా పవన్ ఫిర్యాదు చేశారా? వంటి అంశాలు పెను ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం (నవంబర్ 11,2022) విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ సందర్భంగా పవన్ మోడీకి ఐదు పేజీల లేఖ అందజేశారు. ఈ లేఖలో పవన్ ఏం పేర్కొన్నారు? అనే విషయంపై ఏపీ రాజకీయం అంతా మల్లగుల్లాలు పడుతోంది.
ఈక్రమంలో పవన్ ఐదు పేజల లేఖలో వైసీపీ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి జనసేన అధినేత సిద్ధంగా ఉన్నారని దాంట్లో భాగంగా పవన్ పాదయాత్ర కు సంబంధించి రూట్ మ్యాప్ అడిగారు. అలాగే ప్రతిపక్షాలపైనా.. ప్రభుత్వం చేసే అన్యాయాలపైనా ప్రశ్నించే ప్రజలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తు అక్రమ కేసులు బనాయిస్తోందని పవన్ ప్రధానికి తెలియజేశారు. అలాగే విశాఖలో భూ కుంభకోణాలు, రుషికొండ అంశాలను పవన్ ప్రధాని భేటీలో ప్రస్తావించారు.
ఏపీని హీటెక్కిస్తున్న మూడు రాజధానుల అంశం. అమరావతి రైతుల పాదయాత్ర, రైతుల పాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్నా దురాగతాలు, రైతుల ఇబ్బందులు, రాజధానికి భూమి ఇచ్చిన రైతుల న్యాయపోరాటం, ఏపీలో రహదారుల దుస్థితి, జగనన్న ఇల్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు..అవినీతి వంటి పలు అంశాలపై ప్రధానికి పవన్ కల్యాణ్ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీ బీజేపీ నాయకత్వం తన పోరాటానికి కలిసి రావటంలేదని లేఖలో పవన్ పేర్కొన్నారు.
రాజధాని అమరావతి అంశంలో నలుగురు బీజేపీ నేతల వ్యవహారశైలిపై ఇప్పటికే కేంద్రమంద్రి అమిత్ షా సహా బీజేపీ ముఖ్యనేతలకు పవన్ ఫిర్యాదు చేయటంతో తిరుపతిలో బీజేపీ నేతలకు అప్పట్లో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. ఈక్రమంలో ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా చాలా సంవత్సరాల తరువాత భేటీకి రావాల్సిందిగా పీఎంఓ నుంచి పవన్కు ఫోన్ వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని రెండోసారి పవన్ పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే.







