UPDATED 11th MARCH 2022 FRIDAY 08:00 AM
★ మొక్కుబడిగా హోల్సేల్ ఆయిల్ దుకాణాలపై సివిల్ సప్లైస్ అధికారుల దాడులు
★ రహస్యంగా చేపట్టిన తనిఖీలు
★ అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : ఇటీవల పట్టణంలో హోల్సేల్ ఆయిల్ దుకాణాలపై సివిల్ సప్లైస్ అధికారులు చేపట్టిన తనిఖీలు మొక్కుబడిగా సాగాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీల పేరుతో సివిల్ సప్లైస్ అధికారులు భారీగా లాభపడ్డారని సమాచారం.. ఏదో మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి హోల్ సేల్ వ్యాపారులనుంచి రూ. లక్షల్లో ముడుపులు స్వీకరించినట్లు పలు ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
పెద్దాపురంలో సుమారు ఏడు సంవత్సరాలుగా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి తన ప్రైవేటు వ్యక్తులతో లాబీయింగ్ చేయించి, సదరు వ్యాపారుల నుంచి రూ. లక్షల్లో సొమ్ములు గుంజినట్లు సమాచారం. పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంకు వీధి, ఏడీబీ బ్యాంకు సమీపంలో ఉన్న హోల్ వ్యాపారులకు సంబంధించిన గొడౌన్లలో వేలాది టన్నుల నూనె సరుకు నిల్వలు ఉన్నా కేవలం నామమాత్రంగా సరుకు నిల్వలు ఉన్నట్లు సదరు అధికారి రికార్డుల్లో చూపించి వారి తప్పును కప్పిపుచ్చినట్లు సమాచారం. అందుకు ప్రతిఫలంగా సదరు వ్యాపారుల నుంచి సివిల్ సప్లైస్ అధికారులు భారీగా ముడుపులు లాగేసినట్లు తెలిసింది.
దీనిపై సదరు అధికారిని వివరణ కోరగా రికార్డుల ప్రకారం సరుకు ఉందని, అన్నీ కరెక్టు ఉన్నాయని, మిగిలి విషయాలు తనకు ఏమీ తెలియదని ఆ అధికారి చెప్పారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.







