తిరుపతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్లో వరద బాధితులతో సీఎం మాట్లాడారు. పంటలు, పశువులను నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. తాను అండగా ఉంటానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అంతకుముందు ఫొటో ప్రదర్శనను సీఎం తిలకించారు. నగరంలో వరద సృష్టించిన విలయాన్ని ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు జగన్కు వివరించారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని పాడిపేట వద్ద స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న వంతెనను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.







