హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు అయింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ను ఉప్పర్పల్లి కోర్టు మంజూరు చేసింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. వారిలో దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్ మంజూరైంది. మరో రెండు కేసుల్లో బెయిల్ లభించలేదు. విచారణలో భాగంగా పోలీసులు శిల్పా చౌదరి బ్యాంకు లాకర్ను తనిఖీ చేశారు. కోకాపేట్లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాకు సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. అయితే బ్యాంకు లాకర్లో ఏమీ లభించలేదు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా.. వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆమె పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండ ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.







