- 2018 ఆక్టోబర్ నాటికి పూర్తి
- రెండో విడత ఇళ్ళ నిర్మాణానికి ప్రతిపాదనలు.
-తహశీల్దార్ కార్యాలయం శంకుస్థాపన
- జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
UPDATED 1st NOVEMBER 2017 WEDNESDAY 6:00 PM
మండపేట : తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో నిర్మిస్తున్న 4064 ఎన్టీఆర్ అందరికీ ఇళ్ళు పథకంలో అపార్ట్ మెంట్ల నిర్మాణం శరవేగంతో జరుగుతోందని 2018 అక్టోబర్ నెలాఖరునాటికి పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా పేర్కొన్నారు. మండపేటలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఎన్టీఆర్ అందరికీ ఇళ్ళ అపార్ట్ మెంట్లను గొల్లపుంత వేగుళ్ల వీర్రాజు కాలనీని పరిశీలించారు. అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్న కాంట్రాక్టు కంపెనీ నాగార్జున కనస్ట్రక్షన్స్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అక్కడ నుండి తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని రూ. 90 లక్షలతో నిర్మించనున్న నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తాపేశ్వరం బైపాస్ రోడ్డు భూ సమీకరణ పనులు వేగవంతం చేస్తామన్నారు. రెండో విడత ఎన్టీఆర్ ఇళ్ళు త్వరితగతంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలొ 2016 -17 లో 50 శాతం పూర్తికాగా 2017- 18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి 30 శాతం ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని అన్ని హంగులతో పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తాపేశ్వరం బైపాస్ రోడ్డు భూ సమీకరణలో ఉన్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మారేడుబాక దోన్ నుంచి మారేడుబాక వాటర్ ట్యాంకు అక్కడ నుంచి వంతెన వరకూ రూ. ఏడు కోట్లతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, భూసేకరణ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. కేశవరం ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమవుతోందని రైల్వే, ఆర్ అండ్ బి శాఖలను సమన్వయపరచి పనులు ప్రారంభమయ్యేలా కలెక్టర్ చొరవ చూపాలన్నారు. వీటన్నిటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. సుబ్బారావు, మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, హౌసింగ్ పిడి శ్రీనివాస్, తహసీల్దార్ మేకా వెంకటేశ్వర్లు, కమీషనరు వివి కన్యాకుమారి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు వి. సాయి కుమార్ బాబు, టిట్కో ఎస్.ఈ శ్రీనివాస్, ఈఈ రీటా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.







