UPDATED 11th JULY 2022 MONDAY 11:15 AM
Vijayawada Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాఖాంబరి దేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. వివిధ రకాలైన పళ్లు, కాయగూరలు, ఆకుకూరలతో సర్వాంగసుందరంగా ఆలయ ప్రాంగణం అలంకరణ చేశారు. మూడు రోజుల పాటు కనకదుర్గమ్మ శాఖాంబరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు.
ప్రతి ఏడాది ఆషాడ మాసంలో ఇంద్రకీలాద్రిపై శాఖాంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు.ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కరువుకాటకాలు తొలిగిపోయి.. దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ఆనవాయితీగా శాఖాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి అలంకరణకు భక్తులు పెద్ద సంఖ్యలో కూరగాయలు, పళ్లు విరాళాలు ఇచ్చారు. శాకంబరీ ఉత్సవాలను ఈవో బ్రమరాంబ ప్రారంభించారు.
శాకంబరీ దేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు అంటున్నారు.ఇవాళ ప్రారంభమయ్యే కనకదుర్గమ్మ శాకాంబరి ఉత్సవాలు… ఈనెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలను అమ్మవారికి విరాళంగా ఇస్తారు. అమ్మవారిని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు. మూడు రోజులపాటు అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విఘ్నేశ్వరపూజ, రుత్విక్ వరుణ, పుణ్యాహ వచనం, అఖండ దీపారాధన, అంకురార్పరణతో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధన హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ చేస్తారు. 12వ తేదీ ఉదయం 8 గంటలకు సప్తశతీ పారాయణం, మహా విద్యా పారాయణం, హోమాలు నిర్వహిస్తారు. 13వ తేదీన ఉదయం , హోమం, శాంతి పౌష్టిక హోమం, మండపపూజ అనంతరం ఉదయం పది గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.







