Updated 27 January 2022 Thursday 10:30 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) : జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకానికి నిధులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దేశంలో పట్టణీకరణ భారీ ఎత్తున పెరుగుతున్నదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వలన పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారికి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే పట్టణల్లోనూ ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని ఈ బడ్జెట్లో కేంద్రం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.







