Updated 3rd June 2023 Saturday 9:35 am
Odisha Train Crash : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందం వెళ్లాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిస్థితుల రీత్యా అవసరమైతే ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్లు సన్నద్ధం చేయాలని..ఎమర్జెన్సీ సేవలకోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులు అలర్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్, విశాఖ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఆనంద్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్లతో కూడిన బృందం వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు..ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటుచేయాలని..రైల్వే అధికారులనుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరాతీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పనిచేయాలని సీఎం ఆదేశించారు.
ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలని..క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు.ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు.







