UPDATED 20th JULY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ స్థానిక మఠంసెంటర్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడబోమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని అన్నారు. నాలుగేళ్లుగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, నిధుల విడుదలలో రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజల సత్తా ఏంటో చూపిస్తామని, ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, పడాల వీరబాబు, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.







