UPDATED 5th MARCH 2022 SATURDAY 05:00 PM
Minister Botsa Satyanarayana : ఏపీ మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై బిల్లు పెట్టే అంశంపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
విజయనగరం జిల్లా పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఉగాదికి కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభమవుతుందని చెప్పారు.మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం (మార్చి3, 2022) తీర్పు వెల్లడించింది. ప్రభుత్వానికి శాసనాధికారం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తెలిపింది.
సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వివిధ పిటిషన్లపై వేర్వేరు తీర్పులు వెల్లడించింది. రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది.
అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని పేర్కొంది. రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఇతర అవసరాలకు భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంలో రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు.







