హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం గత కొన్ని రోజులుగా వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో దాన్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలోనూ సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటం లేదని.. అనుకున్న తేదీకే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని రాజమౌళి తనతో చెప్పినట్లు తరణ్ తెలిపారు.







