* కల్యాణోత్సవాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
* జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున
UPDATED 13th MAY 2019 MONDAY 9:00 PM
అన్నవరం: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల పట్ల సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు సందర్భంగా సోమవారం ఉదయం ఆయన క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లుపై సమీక్షించారు. పార్కింగ్ కు సంబంధించి దేవస్థానం జూనియర్ కళాశాల ప్రాంగణం, హరిహరసదన్, ప్రకాష్సదన్ వద్ద చేసిన ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్బాబు జేసీకి వివరించారు. ఈనెల 15వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం జరిగే సమయంలోనే రత్నగిరిపై అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్న నేపథ్యంలో కొండపైకి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెల కార్లు, భోజన వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. దేవస్థానం 5, ప్రైవేటు బస్సులు మరో 10 భక్తులను కొండపైకి ఉచితంగా తీసుకెళ్లేందుకు అందుబాటులో సిద్ధం చేశామని వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నుంచే గ్రామంలో గల వైన్ షాపులు మూయించి వేశామని ఎక్సైజ్ అధికారులు జేసీకి తెలిపారు. భక్తులు తమ అభిప్రాయాలు, ఇబ్బందులు తెలియజేసేలా పెద్ద పెట్టెలను ఏర్పాటు చేయాలని, ప్రతీ రోజూ వాటిని పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఈరంకి జగన్నాథరావు, పీఆర్వో తులా రాముడు, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







