ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని మండిపడ్డారు. 2021-22 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వేజోన్కు కేవలం ₹40 లక్షలు మాత్రమే కేటాయించారనీ, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం చేర్చలేదని మండిపడ్డారు. ఈ రెండు జాబితాలోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలని ఏపీ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే రైల్వేజోన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.







