అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించి రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంపేట మండలంలోని 6 గ్రామాలకు చెందిన బాధిత మహిళల ఎస్హెచ్జీ, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని రుణాలను మాఫీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రూ.8.98 కోట్ల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ స్వయం సహాయక బృందాల రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాలోని రాజంపేట మండల పరిధి గుండ్లూరు, మందపల్లి, పులపుత్తూరు, ఆర్.బుడుగుంటపల్లి, శేషాంబపురం, తాళ్లపాక రెవెన్యూ గ్రామాలకు చెందిన వారికి ఈ మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఏపీ గ్రామీణ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐలో వివిధ పథకాల కింద ఉన్న ఈ మహిళల రుణాలను మాఫీ చేయనుంది. అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చిన ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందున ఏకకాల పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.







