Updated 28th March 2023 Tuesday 7:20 pm
Amaravati Capital Issue: అమరావతి రాజధాని కేసుల విచారణలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసు విచారణ త్వరగా చేపట్టాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో దాఖలైన అన్ని కేసుల విచారణను జూలై 11న చేపడతామని కూడా కోర్టు తెలిపింది.
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం అమరావతినే రాజధానిగా పరిగణిస్తున్నామని, మూడు రాజధానుల అంశం తమకు తెలియదని కోర్టుకు తెలిపింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశంలో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని, కేసు విచారణ త్వరగా చేపట్టాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
అయితే, ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ఒక కేసు విచారణలో ఉండగా, దానికి సంబంధించి మరో కేసును విచారించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏపీ తరఫు లాయర్లపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమని పేర్కొంది. జూలై 11న మొదటి కేసుగా ఈ కేసు విచారణను చేపడతామని స్పష్టం చేసింది. ఈ కేసును విచారిస్తున్న కేఎం జోసెఫ్ జూన్ 16న రిటైర్ కాబోతున్నారు. అందువల్లే ఈ కేసును తిరిగి జూలైలో విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. అయితే, అప్పుడు కొత్త బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.







