Updated 26th April 2017 Wednesday 2:30 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. పట్టణాభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు, ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. అనంతరం ఏడవ వార్డ్ కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న వాటర్ ప్లాంట్లలో తయారవుతున్న నీరు ఎంత మాత్రం నాణ్యతగా ఉండడంలేదని, ధనార్జనే ధ్యేయంగా నాణ్యతా లోపాలతో మంచినీటిని తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి చైర్మన్ స్పందిస్తూ తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ల లైసెన్సులను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే ఐదవ వార్డ్ కౌన్సిలర్ సింగంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి కుళాయిలు నిర్వహణ సరిగా లేకపోవడంతో తాగు నీరు వృధా అవుతోందని దీన్ని వెంటనే అరికట్టాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే శతాబ్ది పార్క్ లో సిసి కెమెరాల మీద లైటింగ్ పడడం కారణంగా అవి సరిగా పనిచేయడంలేదన్నారు. అనంతరం పలు సమస్యలపై కౌన్సిలర్లు చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ ఎ. వెంకట్రావు, కౌన్సిలర్లు గోకిన ప్రభాకరరావు, కాకినాడ రామారావు, పేరిశెట్టి మృత్యుంజయరావు, వాసంశెట్టి గంగ తదితరులు పాల్గొన్నారు.







