అమరావతి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021 ఏపీలో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న ₹2225 పెన్షన్ని ₹2500కు పెంచి ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.
జనవరిలోనే రైతు భరోసా సాయం
అలాగే, డిసెంబర్, జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం వెల్లడించారు. ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో ₹45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. రైతు భరోసా సాయం తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.







