UPDATED 23rd JUNE 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: బిసి వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ -2 పథకం ప్రవేశపెట్టిందని బిసి కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. జ్యోతి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడివో కె. స్వప్న అధ్యక్షతన ఆదరణ -2 పథకంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిసి కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్యోతి హాజరై మాట్లాడుతూ బిసి వర్గాలవారు తమకు కావలసిన పనిముట్లు కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రూ.10 వేలు యూనిట్ కు రూ. ఏడువేలు సబ్సిడీ, రూ. రెండువేలు కార్పోరేషన్ రుణం, రూ. ఒక వెయ్యి లబ్దిదారుడు భరించవలసి ఉంటుందని, అలాగే రూ.20 వేలు, రూ.30 వేలు యూనిట్లకు కూడా 70 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు(శ్రీనుబాబు), మండల టిడిపి అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, సర్పంచులు, ఎంపిటిసిలు, వయోజన విద్య పర్యవేక్షకులు వి.ఎస్. ఆనంద్ బాబు, వివిధ గ్రామాల లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.







