తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి గురువారం రాత్రి అత్యంత వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ మండపంలోకి అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు పఠిస్తూ రోజాలు, తామర, గన్నేరు, చామంతి, తులసీ, మల్లెలు, సంపంగి, కనకాంబరాలు, మొగలి ఆకులు, పన్నీరు ఆకులను అమ్మవారిపై చల్లుతూ యాగం చేశారు. తితిదే ఉద్యాన శాఖ సంచాలకులు శ్రీనివాసులు, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, పేష్కార్ ప్రభాకర్రెడ్డి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసూదన, ఆర్జితం ఇన్స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.







