UPDATED 13th NOVEMBER 2022 SUNDAY 4:10 PM
Pawan Kalyan: ఓట్లు రాకపోయినా సరే జనసేన తరఫున నామినేషన్లు వేస్తాం అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ పర్యటించారు.
ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. ‘‘జగన్ ఢిల్లీ వెళ్లి నాపై చాడీలు చెబుతున్నాడు. పవన్ అది చేశాడు.. ఇలా చేశాడు అని చెప్తున్నాడు. నేను ఢిల్లీ వెళ్లను. ఎక్కడి సమస్యను అక్కడే తేలుస్తా. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నా చొక్కాపట్టుకునే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా? గడపగడపకూ వచ్చే నాయకులను నిలదీయండి. పని చేయని నాయకుడిని చొక్కా పట్టుకుని నిలదీయండి. వైసీపీ నేతలు మర్యాద తప్పితే.. మీరూ తప్పండి. నేను చాలా బలంగా ఉన్నాను. ఓడిపోయాను. దెబ్బతిన్నాను. గాయపడ్డాను. కానీ, వెనుకడుగు వేయను. ఓట్లు రాకపోయినా సరే నామినేషన్లు వేస్తాం.
నామినేషన్లు అడ్డుకుంటే కాళ్లూచేతులూ విరగ్గొడతాం. పదవుల కోసం కాదు.. మార్పు కోసం వస్తాం. మా ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆపం. వీటితోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రైతుల కన్నీళ్లు తుడిచే రాజ్యం జనసేన తీసుకొస్తుంది. యువత చెడిపోతుందనే ఒక్క యాడ్ కూడా చేయలేదు’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.







