Nagari Tension : లోకేశ్ వర్సెస్ రోజా.. నగరిలో తీవ్ర ఉద్రిక్తత, టీడీపీ మహిళా నేతలు అరెస్ట్

Updated 14th February 2023 Tuesday 8:45 pm

Nagari Tension : చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటి ముందు ఆందోళన చేసిన టీడీపీ మహిళా నేతలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు టీడీపీ, వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. మంత్రి రోజా ఇంటికి ఎలా వెళ్తారంటూ టీడీపీ నేతలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ, వైసీపీ నేతలను పోలీస్ స్టేషన్ నుంచి పంపించేస్తున్నారు.

తెలుగు మహిళలు చీర, జాకెట్ తీసుకుని నగరిలో ఉన్న మంత్రి రోజా ఇంటిపైకి వెళ్లారు. ఇంటి లోపలికి చొరబడి వాటిని ఆమెకు ఇచ్చేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడం, బలవంతంగా అక్కడి నుంచి నగరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలంతా నగరికి చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారందరిని విడుదల చేయాలంటూ ఆందోళనకు సిద్ధపడ్డారు.

అదే సమయంలో ఒక్కసారిగా వైసీపీ నేతలంతా నగరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నేరుగా ఒక మంత్రి ఇంటికి ఎలా వెళ్తారంటూ అక్కడే ఉన్న టీడీపీ నేతలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మంత్రి ఇంటిపై దాడికి యత్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది.

పోలీసులు ఇరువర్గాలను కూడా సముదాయించి బలవంతంగా అక్కడి నుంచి బయటకు పంపేశారు. అయినప్పటిక అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నగరి పోలీస్ స్టేషన్ ఆవరణలో నెలకొని ఉంది. పోలీసులు టీడీపీ, వైసీపీ నేతలను పంపేసినా.. ఇరు వర్గాల వారు రోడ్డుకి ఇరువైపులా వేచి చూస్తున్నారు.

దీంతో అక్కడ ఒక రకమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైతే అదనపు పోలీసు బలగాలను దించాలని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా మంత్రి రోజా ఇంటిపైకి తెలుగు మహిళలు వెళ్లిన వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us