* జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి
UPDATED 25th FEBRUARY 2021 THURSDAY 6:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేయడంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీవోలు, ఏపీవోల సమర్ధతపైనే ఎన్నికల నిర్వహణ విజయవంతం అవుతుందని, ప్రతీ ఒక్కరూ అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈఎన్నికల్లో తక్కువ ఓటర్లు ఉన్నారని, ఎలాంటి అలక్ష్యం వహించకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 9,702 మంది, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 7,765 మంది మొత్తం 17,467 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు పీఓ, ఏపీఓలు, ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి సందేహాలున్నా ఈ శిక్షణలో నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ప్రత్తిపాడు, రామచంద్రపురం తహసీల్దార్లు గోపాల కృష్ష, తేజేశ్వరావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు, కలెక్టరేట్ ఎన్నికల డీటి ఎం. జగన్నాథం, తదితర సిబ్బంది హాజరయ్యారు.







