Updated 31 January 2022 Monday 11:00 AM
గన్నవరం (రెడ్ బీ న్యూస్): తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజా వణికిస్తోంది. రాత్రి సమయాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఏపీలో గన్నవరం విమానాశ్రయంలో వాతావరణం మరీ చల్లగా మారిపోయింది. 2022, జనవరి 31వ తేదీ సోమవారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్ వేను పొగమంచును దుప్పటిలా కప్పేసింది. విమానాలు దిగడానికి కనీసం దారి కూడా కనిపించలేదు. ఇక్కడకు వచ్చిన విమానాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సోమవారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా, బెంగుళూరు నుండి వచ్చిన ఇండిగో విమానాలను ఎలా ల్యాండ్ చేయాలో పైలట్లకు అర్థం కాలేదు. దీంతో కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఇండిగో విమానం గంటపాటు 10 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టింది. 42 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం. దిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రికి దారి మళ్లించారు అధికారులు.
మరోవైపు..తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది. రానున్న రెండు రోజులు తెలంగాణలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో 6.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సోమ, మంగళవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ రాష్ట్ర విషయానికి వస్తే.. విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.







