Updated 2nd January 2023 Monday 3:10 pm
Minister Mallareddy Comments : తిరుమలలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం ద్వారా మంత్రి మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. ఏపీలో గెలిపిస్తే కాళేశ్వరం మాదిరిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదని తెలిపారు.
బీఆర్ఎస్ కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో బీఆర్ ఎస్ నుంచి పోటీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.







