UPDATED 13TH MAY 2017 SATURDAY 3:00 PM
REDBEENEWS: ప్రపంచ దేశాలపై శుక్రవారం సైబర్ దాడులు జరిగాయి. సుమారు 99 దేశాల సంస్థలపై సైబర్ అటాక్ జరినట్లు తెలుస్తున్నది. రాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ లక్షల సంఖ్యల్లో కంప్యూటర్లను లాక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 99 దేశాల్లో 75వేల సైబర్ దాడులు జరిగినట్లు సైబర్ సెక్యూర్టీ సంస్థ అవాస్త్ పేర్కొన్నది. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, తైవాన్ దేశాల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగినట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన సైబర్ టూల్స్తోనే ఈ దాడులు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ క్యంపూటర్లను లాక్ చేస్తుంది. ఫైల్స్ ఓపెన్ కావాలంటే అది డబ్బు డిమాండ్ చేస్తుంది. ఇలా 99 దేశాల్లో లక్షల సంఖ్యల్లో కంప్యూటర్లు వైరస్ వల్ల స్తంభించిపోయాయి. బ్రిటన్ లో ఏకంగా హాస్పటళ్లు, క్లినిక్లను మూసివేశారు. కంప్యూటర్లు పనిచేయకపోవడంతో వైద్య సహాయాన్ని నిలిపివేశారు. రాన్సమ్వేర్ వైరస్ను "వన్నాక్రై" అని కూడా పిలుస్తారు. ఒకవేళ ఈ వైరస్ నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలి. శుక్రవారం జరిగిన దాడి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బిట్కాయిన్ ద్వారా డబ్బులు కూడా చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్లైన్లో మూడు వందల డాలర్లు చెల్లిస్తే కంప్యూటర్ వైరస్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ద షాడో బ్రోకర్స్ అనే హ్యాకింగ్ బృందం వైరస్ సాఫ్ట్వేర్ను దొంగలించినట్లు అనుమానాలు వస్తున్నాయి. వాళ్లే ఆ వైరస్ను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. అయితే మార్చి నెలలో ఇలాంటి వైరస్లను ఎదుర్కొనేందుకు మైక్రోసాఫ్ట్ ఓ ప్యాచ్ను రిలీజ్ చేసింది. కానీ చాలా వరకు సిస్టమ్స్ దీన్ని అప్డేట్ చేసి ఉండరు. రాన్సమ్వేర్ దాడి వల్ల బ్రిటన్లో సుమారు 16 హాస్పటళ్లు పేషెంట్ల అపాయింట్మెంట్లు రద్దు చేయాల్సి వచ్చింది. కంప్యూటర్లకు వైరస్ పట్టుకోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులను కూడా నిలిపివేశారు. స్పెయిన్కు చెందిన జాతీయ టెలిఫోన్ సంస్థ కూడా వైరస్ తాకిడికి గురైంది. ఎటర్నల్బ్లూ పేరుతో రాన్సమ్వేర్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్నదని స్పెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఇది అతిపెద్ద సైబర్ దాడి అని బ్రిటన్ సెక్యూర్టీ నిపుణులు కెవిన్ బీమోంట్ పేర్కొన్నారు. రష్యా ప్రభుత్వం కూడా ఈ సైబర్ దాడిపై ప్రకటన విడుదల చేసింది. సుమారు ఒక శాతం వరకు కంప్యూటర్లు రాన్సమ్ వైరస్ వల్ల ప్రభావానికి లోనైనట్లు పేర్కొన్నది. యాంటీవైరస్ బృందాలు రాన్సమ్వేర్ను ధ్వంసం చేసేందుకు పనిచేస్తున్నట్లు రష్యా వెల్లడించింది.







