Updated 2 February 2022 Wednesday 04:20 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విదేశీ విరాళాలను సేకరించేందుకు అవసరమైన ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ ను పునరుద్ధరించాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ సహకారం నియంత్రణ చట్టం( FCRA) ద్వారా భారత్ లోని ఆలయాలు, స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు సేకరించుకోవచ్చు. అయితే పలు సాంకేతిక కారణాల వలన టీటీడీకి సంబందించిన ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ను కేంద్ర హోంశాఖ రెన్యువల్ చేయలేదు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించక పోవడంతో టీటీడీ చేపడుతున్న అనేక స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత పధకాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల ఒక ఆధ్యాత్మిక కేంద్రమని..దేవస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలు, ఉచిత అన్నదాన, విద్య, ఇతర సామజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు విజయసాయి వివరించారు. అందుకు అవసరమైన నిధులు విదేశాల్లో ఉన్న హిందువుల నుంచి సేకరిస్తునట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే.. విదేశీ విరాళాలు సేకరించేందుకు భారతీయ ఎఫ్సిఆర్ఏ చట్టం 1976 ప్రకారం.. టీటీడీ నుంచి అవసరమైన అన్ని పత్రాలను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందించినా.. ఏవో సాంకేతిక కారణాలు సాకుగా చూపి ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ ను రెన్యూవల్ చేయడంలేదని విజయసాయి మండిపడ్డారు. లైసెన్స్ పునరుద్ధరించకపోవడంతో 2021 డిసెంబర్ నాటికి టీటీడీకి అందాల్సిన రూ. 13.4 కోట్ల విదేశీ నిధులు బ్యాంకుల వద్దే నిలిచిపోయాయని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తక్షణమే కేంద్రహోంశాఖ స్పందించి ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.







