TTD Information: ఉగాది సందర్భంగా తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం.. బ్రేక్ దర్శనాలు రద్దు

Updated 11th March 2023 Saturday 5:50 pm

TTD Information: తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా మార్చి 22న ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎలాంటి సిఫారసు లేఖల్ని స్వీకరించబోమని తెలిపింది.

మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది పర్వదినం రోజు సుప్రభాత సేవ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలంకరణ చేస్తారు.

ఈ కార్యక్రమాల అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రయుక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారని టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భక్తులకు కీలక సూచనలు చేసింది. మార్చి 22 ఉగాది రోజు.. శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ కార్యక్రమాల్ని టీటీడీ రద్దు చేసింది. 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఎలాంటి సిఫారసు లేఖల్ని అంగీకరించబోమని ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి, సహకరించాలని టీటీడీ కోరింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us