హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అక్రమాస్తుల కేసులో జగన్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. అక్రమాస్తుల కేసుల్లోని వివిధ చార్జ్ షీట్లపై ఇవాళ విచారణ జరిగింది. ఇవాళ్టి హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి విచారణకు హాజరు మినహాయింపు కోరుతున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కావాలని బెయిల్ షరతుల్లోనే ఉందని న్యాయస్థానం ప్రస్తావించింది. అయితే, వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించామని జగన్ తరఫు న్యాయవాది అశోక్రెడ్డి తెలిపారు. పిటిషన్పై వాదనలు ముగిశాయని, త్వరలో తీర్పు రానుందని వివరించారు. తీర్పు రిజర్వ్లో ఉందని సీబీఐ కోర్టులో చెప్పొచ్చునని విచారణ సందర్భంగా హైకోర్టు సూచించిందని తెలిపారు. లిఖితపూర్వకంగా మెమో రూపంలో సమర్పించాలని సీబీఐ కోర్టు పేర్కొంది. హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉందంటూ జగన్ మెమో దాఖలు చేశారు. హైకోర్టులో ఐఏఎస్ అధికారి మురళీధర్రెడ్డి క్వాష్ పిటిషన్పై వాదనలు కొనసాగాయి. లేపాక్షి హబ్ చార్జ్షీట్ నుంచి తొలగించాలని మురళీధర్రెడ్డి కోరారు. పిటిషన్ పై రేపు సీబీఐ వాదనలు జరగనున్నాయి.







