Telangana Cabinet Decisions : రాష్ట్రంలో కొత్త పథకం, ఒక్కొక్కరికి రూ.3లక్షలు, 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు-కేబినెట్ కీలక నిర్ణయాలు

Updated 9th March 2023 Thursday 10:10 pm

Telangana Cabinet Decisions : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్, పోడుపై నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో  రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. ”2021లో దళితబంధు పథకం ప్రారంభం కాగా ఏటా ఆగస్టు 26న దళితబంధు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించాం.

హుజూరాబాద్ నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం. లబ్దిదారులకు దళితబంధు అందజేశాం. మిగతా 118 నియోజకవర్గాల్లో 1100 మంది చొప్పున ఈ దఫాలో అందజేస్తాం. ఈ మేరకు లబ్దిదారుల ఎంపిక వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. కలెక్టర్ల ద్వారానే ఎంపిక జరుగుతుంది” అని మంత్రి హరీశ్ తెలిపారు.(Telangana Cabinet Decisions)

మరో కొత్త పథకం తీసుకొచ్చింది ప్రభుత్వం. అదే గృహలక్ష్మి పథకం. ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. దీనికి గృహలక్ష్మి పథకం అని పేరు పెడుతున్నామన్నారు. దీని కింద ప్రతి నియోజకవర్గంలో 3వేల ఇళ్ల చొప్పున 4లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. అర్హులకు రూ.3లక్షలను మూడు విడతల్లో ఇస్తామన్నారు. అలాగే గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో నిర్మించుకున్న ఇళ్ల అప్పులను రద్దు చేస్తున్న మంత్రి హరీశ్ ప్రకటించారు. ఈ పథకం కింద రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఇల్లాలి పేరు మీదనే రూ.3లక్షలు ఇస్తామని మంత్రి తెలిపారు. రూ.4 వేల కోట్లు ప్రభుత్వం భరిస్తుందన్నారు.

ఇక రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత గొర్రెల పంపిణీని ఏప్రిల్ లో ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.4వేల 463 కోట్లు కేటాయించింది. అటు పోడు భూముల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. 4లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని మంత్రి వెల్లడించారు.(Telangana Cabinet Decisions)

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమైంది. సమావేశం అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు వివరించారు. ‘రాష్ట్ర కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించి, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో 58,59, దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ, కాశీ, శబరిమలలో రూ.25 కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్‌ లోతైన చర్చ జరిపి నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us