UPDATED 29th MAY 2026 10:15 AM
* భక్తుల రద్దీ నేపథ్యంలో ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం
* సోమవారం వరకు ‘అలంకార’ దర్శనానికే అనుమతి
* ఆన్లైన్ టికెట్లు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు
నంద్యాల, రెడ్ బీ న్యూస్, మే 29 : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి (శుక్రవారం) నుంచి రాబోయే సోమవారం వరకు స్వామివారి స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అలంకార దర్శనానికే మొగ్గు
వారాంతపు సెలవులు కావడం, ఎండల తీవ్రత దృష్ట్యా భక్తుల రాక విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు గాను కేవలం ‘శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి’ మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
ఆన్లైన్ భక్తులకు ఊరట
అయితే, ఇప్పటికే ముందస్తుగా ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు దేవస్థానం స్వల్ప ఊరటనిచ్చింది. వారికి మాత్రం యథావిధిగా నిర్ణీత సమయాల్లో స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు.







