నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: అమరావతి రైతులు వారి ప్రయోజనాల కోసం ‘మహాపాదయాత్ర’ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారని.. ఇందులో ఎటువంటి సత్యం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర భవిషత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు పోరాటం చేస్తున్నారని ఆయన వివరించారు. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతుల చేస్తున్న పాదయాత్ర 35వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. పుట్టంరాజుకండ్రిగలో రైతులు ఇవాళ్టి యాత్ర ప్రారంభించారు. యాత్రకు సంఘీభావం తెలిపిన లక్ష్మీనారాయణ వారితో పాటు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతోందని.. రాజధాని ఒకచోట ఉంటే పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించినప్పుడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ పాలసీలు మారకూడదని తెలిపారు. మరోవైపు ఇవాళ్టి యాత్ర వెంకటరెడ్డిపల్లి, అంబల పూడి, బాలాయపల్లి మీదుగా 15కిలోమీటర్ల మేర సాగి వెంగమాంబపురంలో ముగియనుంది.







