అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: పంట కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రైతులందరికీ మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమాచార లోపం, అలసత్వం లేకుండా రైతులతో నిరంతరం మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని చెప్పారు. ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని.. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ‘‘ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆర్బీకేలో ఐదుగురు సిబ్బందిని నియమించాలి. గోనె సంచులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రైతులకు సొమ్ము జమ చేయడంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా లేదా అన్నదానిపై అధికారులు దృష్టిపెట్టాలి. పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్ను అందుబాటులో ఉంచాలి. సీసీఆర్సీ కార్డ్స్ (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్)లపై అవగాహన నిరంతరం కల్పించాలి. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించాలని.. అలాంటి వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.







