కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 ఆక్టోబర్ 2021: వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో విడతలో 4,26,666 వ్యవసాయ కుటుంబాలకు రూ.93.77 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.7.78 కోట్ల వడ్డీ రాయితీని 60,811 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ మేరకు లబ్ధిని మంగళవారం సీఎం జగన్ తన విడిది కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి మంత్రి వేణు, ఎంపీ వంగా గీత, జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, సంయుక్త కలెక్టర్లు లక్ష్మీశ, కీర్తి, కుడా ఛైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, అధికారులు, రైతులు హాజరయ్యారు. మంత్రి వేణు మాట్లాడుతూ, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతుకు ఏ కష్టం రాకుండా సీఎం అమలు చేస్తున్న పథకాలతో దేశం రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. జేసీ లక్ష్మీశ మాట్లాడుతూ వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దె ప్రాతిపదికన రైతులకు అందించడానికి ఆర్బీకేలకు అనుసంధానంగా కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రైతు భరోసా, సున్నావడ్డీ రాయితీ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి, ప్రజాప్రతినిధులుఅందజేశారు. వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్, డీడీ మాధవరావు ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







