UPDATED 24th FEBRUARY 2022 THURSDAY 11:00 AM
YSRTP: ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పార్టీకి గుర్తింపు లభించింది. షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు ఇచ్చింది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లుగా ఆ పార్టీ చెబుతోంది. కొంతకాలంగా పార్టీకి గుర్తింపు విషయంలో కాస్త ఆందోళనగా ఉన్న షర్మిల పార్టీ నేతల్లో ఆనందం కనిపిస్తుంది. పార్టీకి గుర్తింపు దక్కడం పట్ల వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
లోటస్పాండ్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి గుర్తింపు రాకుండా కొంతమంది అడ్డుపడినట్లుగా చెప్పారు.
కానీ, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని అన్నారు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జిల్లాలు, మండలాలకు కొత్త కార్యవర్గాన్ని షర్మిల ప్రకటిస్తారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కొన్ని రోజులపాటు నిలిచిపోయిన షర్మిల పాదయాత్ర కూడా మళ్లీ పదిరోజుల్లో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు ఆ పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత్రి షర్మిల కేక్ కట్ చేశారు. వేడుకల్లో షర్మిలతో పాటు విజయమ్మ, బ్రదర్ అనిల్, పార్టీ నేతలు పాల్గొన్నారు.







