ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఒలింపిక్స్లో భారత్కు రెండుసార్లు పతకాలు సాధించిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో పోటీ పడిన ఆమె సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆరుగురితో కూడిన ఈ కమిషన్లో సభ్యురాలిగా నియమితులైన సింధు.. ఈ పదవిలో 2025 వరకు కొనసాగనున్నారు. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ -2021 -2025లో ఐరిస్ వాంగ్ (అమెరికా), రాబిన్ తాబ్లింగ్ (నెదర్లాండ్స్), గ్రేసియా పోలీ (ఇండోనేషియా), కిమ్ సోయెంగ్ (దక్షిణ కొరియా) వీవీ సింధు (భారత్), జెంగ్ వీ (చైనా)లను నియమించడం ఎంతో సంతోషంగా ఉందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అథ్లెట్స్ కమిషన్ సభ్యులే ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారని తెలిపింది. త్వరలోనే ఈ కొత్త కమిషన్ భేటీ అవుతుందని, కమిషన్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్గా ఎవరు ఉండాలనేది వారే నిర్ణయిస్తారని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. అనంతరం అథ్లెట్స్ కమిషన్ ఛైర్మన్ను బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లోకి తీసుకోనున్నారు. స్పెయిన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్స్లో డిసెంబరు 17న అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.







