UPDATED 3rdnd MARCH 2022 THURSDAY 06:00 AM
అమరావతి : రాంకీ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ! ఇప్పటికే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బడా పారిశ్రామిక వేత్తలు! ఇక... తదుపరి అవకాశం గౌతమ్ అదానీ ఫ్యామిలీకేనా? ఆయన సతీమణి ప్రీతీ అదానీ వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టనున్నారా? ఇది వైసీపీలో జోరుగా జరుగుతున్న చర్చ! అదానీ కంపెనీకి ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అప్పగించేశారు. అదానీ అడిగారని విశాఖలో లీజుకు ఇవ్వాల్సిన స్థలాన్ని సేల్డీడ్ చేసి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పుడు... అదానీ సతీమణిని రాజ్యసభకూ పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు సభ్యుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుం ది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీజేపీ నుంచి సురేశ్ ప్రభు, వైవీ చౌదరి, టీజీ వెంకటేశ్ పదవీవిరమణ చేస్తారు. ఈ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే జారీ అయ్యే అవకాశముంది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఈ నాలుగూ వైసీపీకే దక్కుతాయి. విజయసాయిరెడ్డికి రెన్యువల్ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీ భార్య ప్రీతి అదానీకి అవకాశం కల్పిస్తారని అంటున్నారు.
మరో రెండు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా ఈ పదవిని కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ను సినీ నటుడు ఆలీ కలిసిన సంగతితెలిసిందే.
త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక మంచి ప్రకటన వస్తుంది అని ఆలీకి జగన్ వెల్లడించారు. ఆలీని రాజ్యసభకు పంపాలని సీఎం నిర్ణయించుకున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా రెండు స్థానాలకు... ముస్లిం మైనారిటీ, ఎస్సీ-ఎస్టీ, కాపు సామాజికవర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది.







