అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : వైసీపీ పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా దెబ్బతిందని.. ఏమాత్రం అభివృద్ధి లేదని విమర్శించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. పన్నులపై పన్నులు వేసి భారం మోపుతున్నారని ఆక్షేపించారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ గ్రహణం వీడాలన్నారు. టీడీపీకి ఈ ఏడాది ఎంతో కీలకమని.. ఏం చేసినా ఈ ఏడాదే చేయాలని చంద్రబాబు అన్నారు. స్థానిక నేతల దోపిడీని స్థానిక నేతలే ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మనం చేసేది రాజకీయ యుద్ధమే తప్ప.. భౌతిక యుద్ధం కాదని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే తప్పిదాలపై పోరాడకుంటే లాభముండదన్నారు.







