Updated 1st April 2023 Saturday 2:10 pm
Botsa Satyanarayana : ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పదో తరగతి పబ్లిక్ పరీక్షల (10th Class Public Examinations) తేదీలను ప్రకటించారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో 3,11,329 బాలురు, 2,97,741 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. మధ్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. లీకేజీకి పాల్పడ్డ టీచర్లను MRO ఆఫీసుల్లో ఉండాలన్న సర్క్యులర్ వెనక్కి తీసుకున్నామని తెలిపారు.







