UPDATED 25th OCTOBER 2018 THURSDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి జెఎన్టీయుకె అంతర్ కళాశాలల 89కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మంచి ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించునట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 20, 21తేదీల్లో రాజాంలోని జిఎంఆర్ ఐటి కళాశాలలో నిర్వహించిన పోటీల్లో తం,ఆ తమ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుచున్న సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అనూష్ బాబు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని, మొత్తం 258కేజీల బరువు ఎత్తి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ గా నిలిచాడని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించడమే కాకుండా జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని, నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో సైతం మంచి ప్రతిభ కనబరచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థి అనూష్ బాబు మాట్లాడుతూ గత సంవత్సరం 85 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ఎనిమిదవ స్థానంలో నిలిచానని, నేడు 89కేజీల విభాగంలో మళ్ళీ పాల్గొని తప్పకుండా మంచి ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని, ఈ విషయంలో వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, తన గురువు వి. సతీష్ కుమార్ ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. రవికిషోర్, ఆదిత్య క్యాంపస్ కోచ్ అరవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.







