Pawan Kalyan: వైసీపీ గూండాల ఉడుత ఊపులకు భయపడం... తాత్కాలికంగా జనవాణి కార్యక్రమం వాయిదా.

UPDATED 16th OCTOBER 2022 SUNDAY 11:30 AM

Pawan Kalyan: ఉత్తరాంధ్ర పర్యటన మూడు నెలల క్రితమే ఫిక్స్ అయింది. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవటం తమ పార్టీ లక్ష్యం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్టులో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

పవన్‌కల్యాణ్‌ బస చేసిన హోటల్‌లో పలువురు జనసైనికులను అదుపులోకి తీసుకున్నారు. పదుల సంఖ్యలో అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటి ఘటన గతంలో కోడి కత్తి ఘటనను గుర్తు చేస్తుందని పవన్ అన్నారు. వాళ్లే పొడిపించుకుని వాళ్లే హడావుడి చేశారని, నిన్న కూడా అలాగే చేశారేమో? అంటూ పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమానికి ముందే తమ జనవాణి కార్యక్రమం ఖరారైందని తెలిపారు.

తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో, మేం ఎక్కడికి వెళ్లాలో కూడా వైసీపీ చెబుతుందా? మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు తమ దగ్గరికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశం అసలు తమ ఎజెండాలో లేదని, మేము జనవాణి కార్యక్రమం నిర్వహించుకోడానికి వచ్చానని, తాము ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. గంజాయి సాగు చేసే వాళ్లని వదిలేసి మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు.

పోలీసులంటే తమకు ఎంతో గౌరవం ఉందని, గతంలో పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కింద నేడు పోలీస్ వ్యవస్థ పనిచేయాల్సి వస్తుందని అన్నారు. పోలీసులు తమ పరిధిని దాటుతున్నారని, నిన్నటి ఘటనలో అడ్డగోలుగా ప్రభుత్వానికి కొమ్ము కాశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గర్జన విఫలమైందన్న అక్కసుతోనే మాపై పోలీసుల్ని ప్రయోగించారని, నిన్న అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని, రోడ్డు మధ్యలో మమ్మల్ని ఆపేశారని పవన్ అన్నారు.

డీసీపీ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదని, ప్రతీనిమిషం డీసీపీకి పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ గూండాల బెదిరింపులు తనకు కొత్తకాదని, వారి ఉడుత ఊపులకు నేను బెదిరే వ్యక్తిని కాదంటూ పవన్ ఘాటుగా హెచ్చరించారు. ఒకటే రాజధానిగా ఉండాలని మేం అనుకున్నామని, రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా అంటూ పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాలో ఘర్షణలు సృష్టించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ఉత్తరాంధ్రా పర్యటనకు వస్తే ప్రభుత్వ అక్రమాలు, భూకబ్జాలపై మాట్లాడతాననే ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us