మనీలా (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: రాయ్ తుపాను ధాటికి కుదేలైన ఫిలిప్పీన్స్లో వెతికినకొద్దీ మృతదేహాలు లభిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పెనుగాలులతో విరుచుకుపడిన తుపాను కారణంగా మృతిచెందినవారి సంఖ్య 375కు చేరుకుంది. ఇంకా 55 మంది జాడ తెలియాల్సిఉంది. మరో 500 మంది గాయాలపాలయ్యారు. తుపాను ధాటికి చెట్లు విరిగిపడి, గోడలు కూలిపోయివడంతోనే మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వేలాది ఇళ్లల్లోని ప్రజలు ఖాళీ చేయలేదని అధికారులు తెలిపారు. ఇళ్లు ధ్వంసమైపోవడంతో అనేక మంది కూడు, గూడుకు దిక్కులేక అవస్థలు పడుతున్నారు. ప్రజలకు సాయమందించాలని స్థానిక అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తుపాను కారణంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయ్ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో ఎదురైన తుపాన్లలో తీవ్రమైనదిగా తెలిపారు. ఇంకా అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.







