Updated 3rd December 2022 6:55 pm
Tirumala Vaikunta Ekadasi : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగున్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు.
రోజుకు 25వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లు విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటర్ తో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు
50వేలు చొప్పున మొత్తం 5 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.







