విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస రెండో గురువారం పూజలు విశాఖలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పాత నగరం బురుజుపేటలో కొలువైన అమ్మవారికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత అభిషేకం తొలిపూజను నిర్వహించారు. మొక్కుబడులు తీర్చుకోవడానికి మహిళలు కలశాలతో పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో మాధవి వెల్లడించారు. పాత నగరంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మార్గశిర మాస పూజల సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ మాధవ్, మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితర ప్రముఖులు దర్శించుకున్నారు.







