UPDATED 9th JULY 2017 SUNDAY 4:00 PM
కాకినాడ : వైద్య మిత్రలకు కనీస వేతనాలు అమలు చేయాలని వైద్యమిత్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ గోవిందు డిమాండ్ చేశారు. ఆదివారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ భవన్లో ఏపీ వైద్య సేవ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టులో వేసిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2011 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వైద్యమిత్రలకు వేతనాలు పెంచలేదని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామన్నారు. అనంతరం చేసిన పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.శ్రావణ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు బి.శేఖర్, సీహెచ్. పైడినాయుడు, రాష్ట్ర కార్యదర్శి బీఆర్డీ రాయ్, వివిధ జిల్లాల అధ్యక్షులు నాగరాజు(కర్నూలు), భానుప్రసాద్(విశాఖపట్నం), మహేశ్(శ్రీకాకుళం), వి.వీరభద్రం(తూర్పు గోదావరి), ఏఐటీయూసీ నేతలు మనోహర్ మాణిక్యం, తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏపీ వైద్య సేవ ఎంప్లాయీస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వి.వీరభద్రం, ఉపాధ్యక్షుడిగా బంగారం, కార్యదర్శిగా వై.మురళీశ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్, కల్యాణి, సత్యవతి, కోశాధికారిగా ఎం.కిషోర్ బాబు, 11 మంది కార్యవర్గ సభ్యులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.







