కాకినాడ (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021: సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి జేసీలు సుమిత్కుమార్, కీర్తి, భార్గవ్తేజతో కలిసి వర్చువల్ విధానంలో ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. 15 రోజులకోసారి వైద్యాధికారులు వారి పరిధిలోని హాస్టళ్లను సందర్శించి, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలుకు ఈ నెల 29 నుంచి రెండు వారాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం జేసీలు వారి పరిధిలోని శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. డీఆర్వో సత్తిబాబు, జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీపీవో నాగేశ్వర్నాయక్, హౌసింగ్ పీడీ వీరేశ్వరప్రసాద్, సీపీవో త్రినాథ్, ఎస్ఈ పీఆర్ శ్రీనివాసరావు, డీఎస్వో ప్రసాదరావు, డీఎం లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







