UPDATED 17th FEBRUARY 2026 6:30 PM
అధికారుల అండతోనే నిబంధనలకు పాతర..!
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు..
ఐ&పీఆర్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
కాకినాడ, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 17 : జిల్లాలో 2026-2027 ద్వైవార్షిక కాలానికి సంబంధించి మీడియా అక్రిడేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) అధికారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, అనర్హులకు అక్రిడేషన్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి, జారీ ప్రక్రియను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్కు రాతపూర్వక ఫిర్యాదు అందింది.
ప్రధాన ఆరోపణలు ఇవే.. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (PRGI) వద్ద రిజిస్ట్రేషన్ పూర్తయి కనీసం ఆరు నెలలు గడవకముందే కొన్ని పత్రికలకు, సంస్థలకు కార్డులు మంజూరు చేసినట్లు సమాచారం.
ఒక వ్యక్తికి రెండు కార్డులు.."ఒక వ్యక్తికి ఒకే అక్రిడేషన్" అనే నిబంధన ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులకు అటు ప్రింట్ మీడియాలో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో సమాంతరంగా కార్డులు కేటాయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనర్హులకు పెద్దపీట..జర్నలిజంతో సంబంధం లేని ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రతినిధులు, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు, చివరకు నిరక్షరాస్యులకు కూడా కార్డులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విచారణకు డిమాండ్..జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఆమోదించిన 489 మంది జాబితాపై సమగ్ర విచారణ జరపాలని, అర్హులైన, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని, తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.







